Ravela Kishore Babu Quits Ysrcp: గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 4 దశాబ్దాలుగా మందకృష్ణ నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు జరుగుతున్న ఉద్యమం చివరి దశకు వచ్చిందన్నారు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో SC వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు, ప్రధాని మోదీపై కిషోర్ బాబు ప్రశంసలు కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించింది.. వైఎస్సార్సీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యింది. ఓటమి బాధలో ఉన్న వైఎస్సార్సీపీకి కొందరు నేతలు షాకిస్తున్నారు.. తాజాగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రెస్మీట్ ఏర్పాటు చేసి ప్రకటించారు.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు 2014లో తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని.. తనకు సాంఘిన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
వైఎస్ జగన్ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైఎస్సార్సీపీలో చేరానన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ను తిరస్కరించారని.. ఈ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అందుకే కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని అందించారన్నారు. అలాగే మందకృష్ణ మాదిగ నలబై ఏళ్లగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారని.. ఇప్పుడు ఆ అంశం ముగింపు దశకు వచ్చిందన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు వర్గీకరణకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే తాను వైఎస్సార్సీపీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన ఉద్యమాన్ని సామాజిక సేవను ముందుకు తీసుకెళ్తానని.. వర్గీకరణ నెరవేరే వరకు పనిచేస్తానన్నారు. అందుకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానన్నారు. త్వరలోనే వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నానన్నారు.
రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరంద చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు.. ప్రత్తిపాడు నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. కొంతకాలానికి బీజేపీకి రాజీనామా చేసి.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు కిషోర్ బాబు. మళ్లీ బీఆర్ఎస్కు రాజీనామా చేసి 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరారు.. ఇప్పుడు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు.