రూ.680 పెరిగి రూ.73,500కి తులం ధర
Gold Price | న్యూఢిల్లీ, జూన్ 6: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహానికి డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పుంజుకున్నాయి. గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర రూ.680 ఎగబాకి మళ్లీ 73 వేలు దాటి రూ.73,500కి చేరుకున్నది.
అంతకుముందు ఇది రూ.72,820గా ఉన్నది. వెండి ర్యాలీ కొనసాగించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.1,400 అందుకొని రూ.91,900 నుంచి రూ.93,300కి చేరుకున్నది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ తులం బంగారం ధర రూ.770 అధికమై రూ.73,420కి చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.700 ఎగబాకి రూ.67,300కి చేరుకున్నది. కిలో వెండి రూ.1,800 ఎగబాకి రూ.98 వేలకు చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 28 డాలర్లు పెరిగి 2,360 డాలర్లకు చేరుకోగా, వెండి 30.30 డాలర్లుగా నమోదైంది.