సెన్సెక్స్ 1,618, నిఫ్టీ 468 పాయింట్లు వృద్ధి
ముంబై, జూన్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ అంచనాను 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచుతూ రిజర్వుబ్యాంక్ ప్రకటించడంతో మదుపరులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికే మోదీ సర్కార్ మూడోసారి అధికారం చేపట్టబోతుండటంతో దూసుకుపోతున్న సూచీలకు ఈ శుభవార్త మరింత కిక్కునిచ్చింది. ఇంట్రాడేలో 1,720 పాయింట్లు (2.29 శాతం) పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ నూతన శిఖరానికి 76,795. 31 స్థాయికి చేరుకున్నది. చివర్లో మార్కెట్ ముగిసే సమయానికి కూడా ఆల్టైం హైకీ 76,693.36 వద్ద ముగిసింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 1,618.85 పాయింట్లు ఎగబాకింది. ఐటీ రంగ షేర్లతోపాటు ఆటో, రియల్టీ, బ్యాంకింగ్ షేర్లలో ర్యాలీ జరిగింది. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో ఇందుకు సంబంధించిన రంగాల్లో షేర్లలో భారీ ర్యాలీ జరిగింది. ముఖ్యంగా ఆటో, రియల్టీ, బ్యాంకింగ్ సూచీలు ఐదు శాతం వరకు లాభపడ్డాయి.
మూడు రోజుల్లో 28 లక్షల కోట్లు
వరుస లాభాలతో మదుపరులు తడిసిముద్దవుతున్నారు. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 4,614 పాయింట్లు లేదా 6.40 శాతం పెరగడంతో మదుపరుల సంపద రూ.28.65 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.28,65,742.36 కోట్లు పెరిగి రూ.4, 23,49,447.63 కోట్ల(5.08 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది.
మెరిసిన హెరిటేజ్ షేరు
తెలుగు దేశం పార్టీకి సంబంధించిన కంపెనీల షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గత ఐదు రోజుల్లో హెరిటేజ్ షేరు 55 శాతం పుంజుకుంది. దీంతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి సంపద రూ.584 కోట్లు పెరిగింది. మే 31న రూ.402.90 వద్ద ఉన్న హెరిటేజ్ షేరు ధర శుక్రవారం మరో 10 శాతం పెరిగి రూ.661.25 వద్దకు చేరుకున్నది. దీంతో కంపెనీలో 24.37 శాతం వాటా కలిగివున్న భువనేశ్వరి, 10.82 శాతం వాటా ఉన్న బ్రాహ్మణి నికర విలువ మరో రూ.870 కోట్లు పెరిగి రూ. 2,190 కోట్లకు చేరింది.