JDU : కొత్తగా కొలువుదీరబోతున్న నరేంద్రమోదీ (Narendra Modi) ప్రభుత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లోని కీలక భాగస్వామ్యపక్షమైన జనతాదల్-యునైటెడ్ (JD-U) కు రెండు క్యాబినెట్ బెర్త్లు దక్కనున్నాయి. పార్టీలోని ఇద్దరు సీనియర్ నాయకులకు కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయి. జేడీయూలోని విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
తమ పార్టీలో మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై జేడీయూ ఇప్పటికే ఒక ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. సీనియర్ నేతలైన లలన్సింగ్, రామ్నాథ్ ఠాకూర్ పేర్లను కేంద్ర పదవుల కోసం జేడీయూ ప్రతిపాదించినట్లు సమాచారం. లలన్సింగ్ బీహార్లోని ముంగేర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. రామ్నాథ్ ఠాకూర్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
రామ్నాథ్ ఠాకూర్ ఇటీవల మరణానంతం భారతరత్న అవార్డు పొందిన కర్పూరీ ఠాకూర్ కుమారుడు. కాగా ఈ లోక్సభ ఎన్నికల్లో జేడీయూ 12 లోక్సభ స్థానాలు దక్కించుకుంది. బీజేపీకి సొంత మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా ఏ మిత్రపక్షానికి ఎన్ని క్యాబినెట్ బెర్త్లు అనే కోణంలో చర్చ జరుపుతోంది.
కేంద్ర మంత్రలుగా ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారనేది ఆదివారం ప్రమాణస్వీకార కార్యక్రమంలోపు నిర్ణయిద్దామని, శుక్రవారం జరిగిన ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు రేపు సాయంత్రంలోగా మంత్రలుగా ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారనేది నిర్ణయించనున్నారు.