NAMO 3.O: ఊహించిన పేర్లు.. ఊహించని ట్విస్ట్‌లు.. పక్కా వ్యూహంతో టీడీపీ నుంచి మంత్రుల ప్రతిపాదన

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్‌ విక్టరీ కొట్టిన టీడీపీకి..బోనస్‌గా కేంద్రంలో కూడా చక్రం తిప్పే అవకాశం కూడా లభించింది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన తెలుగుదేశం పార్టీకి..మోదీ కేబినెట్‌లో రెండు మంత్రి పదవులు దక్కాయి. అయితే ఇద్దరు మంత్రుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు చంద్రబాబు. ఇంతకూ రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని ఎంపికలో కీలకంగా మారిన ఆ అంశాలేంటి..?
మోదీ 3.O టీమ్‌లో ఈసారి ఏపీ నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ ఎంపీలతో పాటు ఓ బీజేపీ ఎంపీకీ స్థానం దక్కింది. అయితే కేంద్ర మంత్రివర్గ బెర్త్‌ల కేటాయింపులో వ్యూహాత్మకంగా వ్యవహరించాయి రెండు పార్టీలు. ఓ వైపు సామాజిక వర్గ కూర్పుతో పాటు..పార్జీ భవిష్యత్‌ అవసరాలపై పక్కా ప్రణాళికలతోనే ముగ్గురి పేర్లను ఫైనల్‌ చేసినట్టు తెలుస్తోంది.
రామ్మోహన్ నాయుడు:

శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు..అందరూ ఊహించినట్టే కేంద్రమంత్రయ్యారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడు ఎంపీగా శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా తట్టుకుని నిలబడి, ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎర్రన్నాయుడి కుమారుడిగా, ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవమున్న నాయకుడిగా రామ్మోహన్‌నాయుడికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించిందే. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యంతో పార్లమెంట్‌ చర్చల్లో ఆయన ఇప్పటికే ముద్ర వేశారు. విభజన హామీలతో పాటు పలు అంశాలపై పార్లమెంటులో జరిగిన చర్చల్లో తన వాయిస్‌ను బలంగా వినిపించారు రామ్మోహన్‌నాయుడు. గత ఎన్నికల్లో టీడీపీ కేవలం 3 ఎంపీ సీట్లలోనే విజయం సాధించడంతో..పార్లమెంటులో ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం రాలేదు. ఈ క్రమంలో రామ్మోహన్‌నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్‌మీడియాలో కూడా వైరల్‌ అయ్యాయి. ఈ సారి తాము బిగ్ నంబర్‌తో వస్తామని.. అప్పుడు టైం కోసం పదే, పదే రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదని అప్పటి ఆయన వ్యాఖ్యల సారాంశం
.అప్పుడు రామ్మోహన్‌నాయుడు చెప్పినట్టే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది టీడీపీ. పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 16 స్థానాలను గెలుపొందింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు రామ్మోహన్‌నాయుడికి కేంద్ర మంత్రిగా ప్రతిపాదించారు. ఎర్రన్నాయుడి మృతితో రాజకీయ రంగప్రవేశం చేశారు.. రామ్మోహన్‌నాయుడు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌యాత్ర చేసి, పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తొలిసారి పోటీ చేసి 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఓటమిపాలయినా రామ్మోహన్‌నాయుడు మాత్రం ఎంపీగా గెలిచి శ్రీకాకుళంపై తన పట్టు నిలబెట్టుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొంది తనకు తిరుగు లేదని నిరూపించుకున్నారు.

రామ్మోహన్‌నాయుడికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ద్వారా బీసీలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను కూడా నెరవేర్చినట్టయింది. టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్రకు చోటిస్తూ వస్తున్నారు చంద్రబాబు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో టీడీపీ చేరడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా.. కింజరాపు ఎర్రన్నాయుడికి అవకాశం ఇచ్చారు. 2014లో ఎన్డీయే సర్కారులో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా అశోక్‌గజపతిరాజును ఎంపిక చేశారు. ఇప్పుడు రామ్మోహన్‌నాయుడికి అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఉన్న ఇష్టాన్ని మరోసారి ప్రకటించినట్లయింది.
పెమ్మసాని చంద్రశేఖర్:

ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు అనూహ్యంగా కేంద్రమంత్రిగా అవకాశం కొట్టేశారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన పెమ్మసాని చంద్రశేఖర్‌.. అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ‘యు వరల్డ్‌’ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను ప్రారంభించి, స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణిస్తూ అతికొద్దికాలంలోనే రూ.వేల కోట్లకు ఎదిగింది. ఏపీలో బలమైన కమ్మసామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు అంతర్జాతీయంగా చంద్రశేఖర్‌కు ఉన్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయన్ను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ప్రతిపాదించినట్లు చెబుతున్నారు.

చంద్రశేఖర్‌ తండ్రి సాంబశివరావు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా ఆయన నరసరావుపేట ప్రాంత వాసులకు చిరపరిచితులు. ఇక చంద్రశేఖర్‌ ఎంసెట్లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించారు. అనంతరం అమెరికాలో పీజీ పూర్తి చేశారు. అమెరికాలోని డాలస్‌లో పెమ్మసాని ఫౌండేషన్‌ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. తొలి నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్‌ ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు.

ప్రస్తుతం క్యాబినెట్‌ ఎంపికలో 10 స్థానాలకంటే ఎక్కువ చోట్ల గెలిచిన పార్టీలకే ప్రాతినిధ్యం కల్పించారన్న చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో జరిగే విస్తరణలో టీడీపీకి మరో రెండు మంత్రి పదవులు లభించే అవకాశం ఉందని చెబుతున్నాయి..ఆ పార్టీ వర్గాలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles