తెలంగాణ బీజేపీకి..కేంద్రంలో ప్రమోషన్ లభించింది. కేబినెట్లో బెర్త్ల సంఖ్య డబుల్ అయింది. మరి మోదీ 3.O టీమ్లో చోటు దక్కించుకున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కలిసొచ్చిన అంశాలేంటి..? కేబినెట్ రేసులో వెనుకబడ్డ ఈటల, డీకే.అరుణలకు పార్టీ ఎలాంటి అవకాశాలు ఇవ్వనుంది..? రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకునేది ఎవరు?
తెలంగాణలో 8 లోక్సభ స్థానాలు సాధించి మంచి జోష్లో ఉంది.. బీజేపీ. రాష్ట్రం నుంచి గతంలో ఒకరికే కేబినెట్ బెర్త్ లభించగా ఈ సారి ఇద్దరికి అవకాశం లభించింది. సికింద్రాబాద్నుంచి రెండోసారి ఎంపీగా విజయం సాధించిన కిషన్రెడ్డి..మోదీ కేబినెట్లో మరోసారి బెర్త్ దక్కించుకున్నారు. 2019లో తొలిసారి ఎంపీగా గెలిచి హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిషన్రెడ్డి.. ఆ తర్వాత ప్రమోషన్దక్కించుకుని పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మరోసారి కిషన్రెడ్డికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కడంపై ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో తెలంగాణ నుంచి కిషన్రెడ్డి ఒకరే ప్రాతినిధ్యం వహించగా..ఈ సారి బండి సంజయ్ కూడా జత కలిశారు. కరీంనగర్ ఎంపీగా 2019లో విజయం సాధించిన బండి సంజయ్..ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనదైన దూకుడును చూపించారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు బండి సంజయ్ దూకుడే కారణమన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి..రెండోసారి ఎంపీగా గెలిచి మోదీ టీమ్లో చేరిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి పలుమార్లు ప్రధాని మోదీతో శభాష్ అనిపించుకున్న సంజయ్.. పార్టీ కోసం చేసిన సేవలు, చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి పార్టీకి విధేయత వంటి అంశాలు కలిసివచ్చాయి. బండి సంజయ్కు కేంద్రమంత్రిగా అవకాశం లభించడంతో కరీంనగర్లో కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
తెలంగాణ బీజేపీలో దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్తో పాటు సంయమనంతో వ్యవహరించే కిషన్రెడ్డికి కూడా అవకాశం కల్పించి రాష్ట్రంలో పార్టీని బ్యాలన్స్ చేసే ప్రయత్నం చేసింది బీజేపీ అధిష్ఠానం.
తెలంగాణలో గతంతో పోలిస్తే రెట్టింపు సీట్లు సాధించిన బీజేపీలో ఈ సారి కేబినెట్ బెర్త్ కోసం కూడా గట్టిపోటీ నెలకుంది. కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు ఈటల రాజేందర్, డీకే అరుణ కూడా కేంద్రమంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే మరోసారి కిషన్రెడ్డిని కేంద్రమంత్రిగా కంటిన్యూ చేయడంతో పాటు బండి సంజయ్ను కేబినెట్లోకి తీసుకోవడంపై హైకమాండ్ గట్టి కసరత్తే చేసింది. పార్టీకి తొలినుంచి విధేయులుగా ఉండడంతో పాటు రాష్ట్రంలో పార్టీ విస్తరణకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కారణమయ్యారని బీజేపీ అధిష్ఠానం భావించింది. గత కేబినెట్లో మినిస్టర్గా పని చేయడంతో పాటు ఇప్పటికే నాలుగు సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించడం, కరోనా టైమ్లో కేంద్రమంత్రిగా ఢిల్లీ కేంద్రంగా కంట్రోల్ రూంలో కీలక బాధ్యతలు నిర్వర్తించడం, అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉండటం కిషన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలుగా భావిస్తున్నారు.
ఈటల వైపే..
ఇతర పార్టీల నుంచి ఇటీవలే బీజేపీలో చేరడం ఈటల రాజేందర్, డీకే అరుణలకు మైనస్ అయినట్టు తెలుస్తోంది. అయితే సీనియర్ అండ్ వాల్యూబుల్ నేతలుగా ఉన్న వీరిద్దరికి పార్టీ ఎలాంటి అవకాశం ఇస్తుందోనన్న ఆసక్తి ఇప్పుడు ఏర్పడింది. వీరిలో ఒకరికి బీజేపీ రాష్ట్ర బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లే యోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ కు పార్టీ అధిష్టానం నుంచి కూడా సమాచారం అందినట్లు తెలుస్తోంది. మరి డీకే అరుణకు ఎలాంటి అవకాశం ఇస్తారన్న చర్చ ప్రస్తుతం పార్టీలో జరుగుతోంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా ఉన్న అరుణకు మరోసారి పార్టీలోనే ప్రమోషన్ ఇస్తారా లేక మరో పదవి ఆఫర్ చేస్తారా అన్న ఆసక్తి పార్టీలో నెలకుంది.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అంచనాలకు తగ్గట్లే పర్ఫామ్ చేసింది. డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్గా బరిలోకి దిగిన రాష్ట్ర నాయకత్వం ఆ మేజిక్ సాధించలేకపోయినా.. గతంకంటే రెట్టింపు సీట్లు గెలిచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తిగా నిరూపించుకుంది. గతంలో ఒక అసెంబ్లీ స్థానంతో పాటు నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలతో పాటు.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారపార్టీతో సరిసమానంగా 8 ఎంపీ సీట్లు గెలిచింది. దీంతో తాము కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచామని, ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు తమ చేతికొస్తాయన్న ధీమా బీజేపీలో కనిపిస్తోంది.
రాష్ట్రంలో ప్రతి ఎన్నికకు ఓట్లు, సీట్లు పెంచుకుంటున్న బీజేపీ.. డబుల్ డిజిట్ కాకపోయినా గతకంటే డబుల్ ఎంపీ సీట్లలో విజయబావుటా ఎగురవేసింది. 8 ఎంపీ స్థానాలతో అధికార కాంగ్రెస్ పార్టీకి దీటైన పోటీ ఇచ్చింది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపడతామన్న ధీమాతో వ్యూహాలకు పదునుపెడుతోంది కాషాయ పార్టీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా తెలంగాణపై గట్టిగా ఫోకస్ పెట్టడంతో ఈ సారి రెండు కేబినెట్ బెర్త్లు కేటాయించింది. దీంతో తెలంగాణలో అధికారమే తరువాయి అంటూ 2028ను టార్గెట్గా పెట్టుకుంది. మరోవైపు పెరిగిన సీట్లతో పాటు ఓట్ల శాతం కమలం శ్రేణుల్లో జోష్ నింపింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామని ఇప్పటినుంచే ధీమా వ్యక్తంచేస్తున్నారు కమలనాథులు..