నమస్తే హైదరాబాద్ (కూకట్పల్లి) :సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోనని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సబిహ గౌసుద్దీన్ తో పాటు మున్సిపల్, జలమండలి, ఇరిగేషన్ విభాగాల అధికారులతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా డివిజన్లోని యూసఫ్ నగర్ , సబ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్లో పర్యటించి స్థానికులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులను అడిగి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలు సమస్యలతో అల్లడిల్లిపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూసఫ్ నగర్ , సబ్దార్ నగర్లో డ్రైనేజీలు పొంగిపొర్లుపోవడం, రోడ్లు సరిగా లేకపోవడం, సమయానికి త్రాగు నీరు రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్ గాంధీ నగర్ లో వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజీలు పొంగి పొర్లడం ఇళ్లలోకి మురుగునీరు వర్షపునీరు వచ్చి చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రాజీవ్ గాంధీ నగర్ నుండి మైసమ్మ చెరువుకు అనుసంధానంగా పైప్ లైన్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. పైప్ లైన్ నిర్మాణంతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అధికారుల పనులకు స్థానికులు అడ్డుపడరాదని, లింక్ రోడ్ల నిర్మాణం కోసం స్థలం వదిలి పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేయాలని మరియు రాజీవ్ గాంధీ నగర్, సబ్దార్ నగర్ లల్లో కరెంటు పోల్స్ ఏర్పాటు చేయాలనీ అధికారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ అధికారులు లక్ష్మి నారాయణ, ప్రకాష్, రంజిత్, భాస్కర్ మరియు నాయకులు గౌసుద్దీన్, ఐలయ్య, వీరారెడ్డి, దుర్గ, రమేష్ , సంపత్ రెడ్డి , రియాజ్, హమీద్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.