• మొదటి ప్రజా పాలనలోనే ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించిన ఇప్పటికీ స్పందించని వైనం
• రోడ్డు విస్తరణ చేపట్టాలని ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల వేడుకోలు
• ప్రమాదకరంగా మూడు వంకలతో చాలా దగ్గరగా లక్ష్మాపురం చెరువు అలుగు క్రింది రోడ్డు
• అలుగు దగ్గర బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థుల విజ్ఞప్తి
నాగారం నమస్తే హైదరాబాద్:
మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామానికి వెళ్ళే రహదారి అడుగడుగునా గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తొలి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా లక్ష్మాపురం గ్రామానికి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ముఖ్య అతిథిగా హాజరయ్యి లక్ష్మాపురం ఎక్స్ రోడ్ నుండి కాశీ తండా వరకు డబల్ బీటీ రోడ్డు మరియు అలుగు దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేపడతానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే ప్రెస్ మీడియా సమక్షంలో నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నట్లు ప్రకటన చేశారు. కానీ ప్రకటించిన రోడ్ల విస్తరణలో భాగంగా లక్ష్మాపురం రోడ్డు గురించి ప్రకటన చేయలేదు. లక్ష్మాపురం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మాపురం ఎక్స్ రోడ్డు నుండి కాశీతండ గ్రామపంచాయతీ వరకు ఉన్న తారురోడ్డు గత కొన్ని సంవత్సరాల నుండి గుంతల మయంగా మారి కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లలేని పరిస్థితికి మారింది. రహదారి మొత్తం పూర్తిగా గుంతల మయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు పగలు,రాత్రి వేళల్లో ప్రయాణిస్తూ గుంతలల్లో,రోడ్డుపై తేలిన కంకర తగిలి క్రిందపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో గ్రామ ప్రజలు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నో మార్లు మొరపెట్టుకున్న పట్టించుకోకుండా తట్టెడు మట్టి కూడా పోసిన పాపాన పోలేదు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజా పాలనకు వస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే మనస్సు చలించిపోయి ఈ రోడ్డుని డబుల్ రోడ్డుగా మారుస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మాపురం చెరువు అలుగు క్రింద రోడ్డు చాలా దగ్గరగా మూడు వంకలు ఉండటం వలన వాహనదారులు ప్రయాణం చేయడానికి చాలా ప్రమాదకరంగా ఉంది. అలుగు వద్ద బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో వరద ఉధృతి పెరగడంతో అలుగు పోస్తున్న సందర్భంలో ప్రజల రాకపోకలకు రెండు మూడు రోజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మాపురం ఎక్స్ రోడ్ నుండి కాశీ తండా తారు రోడ్డు వరకు డబల్ రోడ్డుగా మారిస్తే అటు వెలుగుపల్లి నేషనల్ హైవే రోడ్డుకు,ఇటు పర్సాయిపల్లి మీదుగా వెళ్ళిన తర్వాత సూర్యాపేట జనగాం ప్రధాన రహదారికి ఈ రోడ్డు అతి దగ్గరలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రజలు తెలుపుతున్నారు. కనుక వెంటనే తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ స్పందించి లక్ష్మాపురం ఎక్స్ రోడ్ నుండి కాశీతండ వరకు డబల్ రోడ్డును, మరియు చెరువు కట్ట అలుగు దగ్గర బ్రిడ్జిని మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని లక్ష్మాపురం గ్రామ ప్రజలు ఎమ్మెల్యేను వేడుకుంటున్నారు.