న్యూఢిల్లీ: దక్షిణ భారతంలో ఎన్డీఏ కూటమి కొత్త రాజకీయాలకు తెరలేపిందని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కానీ ఆ రాష్ట్రాల ప్రజలకు ఆ ప్రభుత్వాలతో బంధం తెగిపోయిందని, వాళ్లు భ్రమ నుంచి త్వరగా బయటకు వచ్చి, ఎన్డీఏను ఆమోదించారని ఆయన అన్నారు. తమిళనాడు కోసం పని చేసిన బృందాన్ని కూడా ఆయన అభినందించారు. తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవమన్న విషయం అందరూ చెప్పారని, కానీ తాము మాత్రం కలిసికట్టుగా పోరాడినట్లు వెల్లడించారు. తమిళనాడులో సీట్లు గెలవకున్నా.. అక్కడ మాత్రం ఎన్డీఏ ఓట్ షేర్ అమాంతంగా పెరిగిందన్నారు. ఇది స్పష్టమైన సందేశం ఇస్తోందని, రేపటి రోజు ఏం రాసి ఉందో చెబుతోందన్నారు. కేరళలో వందలాది మంది కార్యకర్తలు బలయ్యారని, కశ్మీర్ కన్నా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ప్రాణాలు కోల్పోయారని, కానీ తొలిసారి ఆ రాష్ట్రంలో తమ పార్టీ ఓ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.