Subscribe
ఆస్తమా రోగుల కోసం ఏటా చేప ప్రసాదం పంపిణీ
170 ఏళ్లుగా అందజేస్తోన్న బత్తిన కుంటుబీకులు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి
జూన్ 8న మృగశిర కార్తె ఉదయం ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రోజుల పాటు ఈ ప్రసాదం పంపిణీ చేస్తారు. పూజాకార్యక్రమాల అనంతరం జూన్ 7న దూద్బౌలిలో ప్రసాదం తయారీ చేస్తారు. సుమారు 170 సంవత్సరాల నుంచి బత్తిన వంశస్థులు అస్తమా రోగులకు ఈ ప్రసాదం అందజేస్తూ ఉన్నారు. కొర్రమీను చేపతో వీరు ఇచ్చే ప్రసాదం వల్ల ఉబ్బసం తగ్గుతుందని నమ్మకం.
ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్లోని నాంపలి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిన కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదం కోసం పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఏడాది కూడా పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం (జూన్ 8న) నుంచి మృగశిర కార్తె మొదలుకావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, ఆర్డీవో మహిపాల్రెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ మనోహర్, ఫిషరీస్ విభాగం అడిషినల్ డైరెక్టర్ శంకర్, ఏసీపీ ఆకుల చంద్రశేఖర్, సీఐ విజయ్కుమార్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి హన్మంత్రావు గురువారం పర్యవేక్షించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడుల నుంచి వేలాది మంది తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్ లోపలికి అజంతా గేటు నుంచి అనుమతిస్తారు. అక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్లలో చేప ప్రసాదం కోసం క్యూలైన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా టోకెన్లు ఇచ్చి అనంతరం.. కౌంటర్లో చేప ప్రసాదం అందజేస్తారు. పంపిణీకి మొత్తం 32 కౌంటర్లను ఏర్పాటు చేయగా.. ఇందులో దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి.