హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ జనరల్(TGNAB Director) సందీప్ శాండిల్య(Sandeep Sandilya) పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ(Tenure extended) ఉత్తర్వులు జారీ చేశారు. 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన టీన్యాబ్ డైరెక్టర్గా గతేడాది డిసెంబర్ 13న బాధ్యతలు తీసుకున్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గతేడాది అక్టోబర్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సీవీ ఆనంద్ను ఎన్నికల కమిషన్ (EC) తొలగించింది. ఆయన స్థానంలో సందీప్ శాండిల్యాను నియమించింది. అయితే డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆయనను టీ న్యాబ్కు బదిలీ చేసింది. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ సీపీగా నియమించింది.
కాగా, ఢిల్లీకి చెందిన సందీప్ శాండిల్య.. 1993 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్. మొదట గుంటూరులో, ఆ తర్వాత నల్లగొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్ డీసీపీగా పనిచేశారు. సీఐడీ, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో సేవలందించారు. 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు. రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా కూడా పనిచేశారు. జైళ్లశాఖ డీజీగా మూడు నెలలపాటు పనిచేసిన సందీప్ శాండిల్య.. పోలీస్ అకాడమీ డైరెక్టర్గా, హైదరాబాద్ సీపీగా విధులు నిర్వహించారు.