అమరావతి : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కార్యాలయ వ్యవహార తీరుపై వైసీపీ నాయకులు ఒక్కొక్కరూ పెదవి విప్పుతున్నారు. సీఎంవో (CMO) కార్యాయంలో పనిచేసే అధికారుల ప్రవర్తన వల్ల నియోజకవర్గ సమస్యలను నేరుగా వైఎస్ జగన్కు చెప్పుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే (Former YCP MLA) కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkataramireddy ) వైఎస్ జగన్ పాలనలో సీఎంవో తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నియోజకవర్గ సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు వెళితే సీఎంవో తీరుతో కలిసేందుకు వీలయ్యేది కాదని ఆరోపించారు. మంత్రులు (Ministers) , ఎమ్మెల్యేలు సైతం అనేక ఇబ్బందులు పడ్డారని, గంటల తరబడి ఎదురుచూసే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. ధర్మవరం రైల్వే ఉపరితల వంతెన (Rlyway Over Bridge) నిర్మాణం కోసం భూసేకరణకు అవసరమయ్యే రూ.15 నుంచి రూ.20 కోట్ల మంజూరికి వందసార్లు సీఎం కార్యాలయం చుట్టూ తిరిగి వేసారి పోయానని ఆందోళన వ్యక్తం చేశారు.
రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని 50 సార్లు ఫైనాన్స్ సెక్రెటరీ చుట్టూ తిరిగినా పనికాలేదని వాపోయారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడం వల్లే అత్యధిక స్థానాల్లో గెలుపొందారని వెల్లడించారు. వైసీపీ కూడా పెన్షన్ను పెంచుతూపోతామని భరోసా ఇచ్చి ఉంటే ఫలితాలు సానుకూలంగా వచ్చి ఉండేవని అన్నారు. ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ పరిచాయని పేర్కొన్నారు.