Loksabha Speaker | మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న తరుణంలో ఎవరెవరికి కేంద్ర మంత్రులుగా ఛాన్స్ వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురి పేర్లు కన్ఫార్మ్ అవ్వగా.. వారికి ఏ శాఖలు ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే లోక్సభ స్పీకర్ పదవిపై ఆసక్తికరమైన ప్రచారం మొదలయ్యింది. ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరికి స్పీకర్ పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి.
మోదీ ప్రభుత్వం తొలిసారిగా ఏర్పడినప్పుడు లోక్సభ స్పీకర్గా సుమిత్రా మహాజన్కు అవకాశమిచ్చారు. రెండో టర్మ్లో ఓం బిర్లాను ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు మూడో టర్మ్లో మళ్లీ మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తోందట. ఈ క్రమంలోనే స్పీకర్ పదవికి పురంధేశ్వరి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు హిందీ, ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం ఉండటంతో బీజేపీ ఆమె పేరును పరిశీలిస్తోందని సమాచారం.
కాగా, స్పీకర్ పదవి ఇస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇవ్వాలని దగ్గుబాటి పురంధేశ్వరిని తాజాగా మీడియా అడిగింది. ఓ మీడియా ఛానల్ రిపోర్టర్ అడగ్గా.. పురంధేశ్వరి మౌనంగానే ఉండి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు. దీంతో మళ్లీ రిపోర్ట్ అదే ప్రశ్న అడగ్గా.. మళ్లీ నమస్కారం పెడుతూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. ఈ క్రమంలో స్పీకర్ పదవి పురంధేశ్వరికి కన్ఫార్మ్ అయినట్లు ఉందని ప్రచారం మరింత ఎక్కువైంది. దీనిపై కాసేపట్లోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.