విద్యతోనే మంచి భవిష్యత్తు
– విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
– విద్యార్థులంతా బాగా చదువుకుని ఉన్నతంగా రాణించాలి.
– పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి.
మేడిపల్లి (నమస్తే హైదరాబాద్): విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులంతా బాగా చదువుకుని భవిష్యత్లో ఉన్నతంగా రాణించాలని మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల పునః ప్రారంభ సందర్బంగా మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి హాజరై విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫార్మ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…విద్యార్థులు బాగా చదువుకోవడానికి ప్రభుత్వం అన్నిరకాల వసతులు కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, నాణ్యతతో కూడిన విద్యను అందిస్తోంది కాబట్టి గతంలో కంటే నేడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో గతంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్స్,ఆగ్లంలో భోదన, కంప్యూటర్ శిక్షణ,మరుగుదొడ్లు నిర్మాణం, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం మొదలైన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో అదనపు తరగతి గదులు నిర్మాణం చేయడంతో పాటు పారిశుధ్య నిర్వహణ మున్సిపల్ సిబ్బంది ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు.
– విద్యతోనే మంచి భవిష్యత్…
విద్యతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి అన్నారు. విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బచ్చ రాజు,మధుసూదన్ రెడ్డి,ఏంపల్ల అనంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘు వర్ధన్ రెడ్డి, లేతాకుల రఘుపతి రెడ్డి, జావీద్ ఖాన్,ప్రధానోపాద్యాయులు సత్యపాల్,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.