హైదరాబాద్, జూన్ 23: మార్నింగ్ వాకింగ్కు వెళ్లిన మహిళపై వీధి కుక్కల గుంపు దాడి చేసిన ఘటన స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 వీధి కుక్కలు పాశవికంగా దాడికి తెగబడ్డాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో శనివారం (జూన్ 22) ఉదయం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఉదయం 6 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తోన్న మహిళపై వీధికుక్కలు ఒకసారిగా దాడికి తెగబడ్డాయి. సుమారు 15 కుక్కలు మహిళను చుట్టుముట్టాయి. ఆమెను కరిచేందుకు విఫలయత్నం చేశాయి. చుట్టుముట్టిన వీధి కుక్కల బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ గట్టిగా కేకలు వేసినా అవి కాస్తైనా వెనకడుగు వేయలేదు. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో మహిళ కిందపడిపోవడంతో కుక్కలన్నీ ఆమెపైకి ఎగబడ్డాయి. తనచేతులతో వాటిని అదిలిస్తూ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ మహిళ అష్టకష్టాలు పడింది. ఉదయం వేళ కావడంతో రోడ్డు కూడా నిర్మానుష్యంగా ఉండటంతో కుక్కలు రెచ్చిపోయాయి. ఇంతలో అటుగా ఓ ద్విచక్రవాహనదారుడు, కారు రావడంతో కుక్కలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించాయి. కుక్కలదాడిలో మహిళ ప్రాణాలతో బయటపడినప్పటికీ.. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.