• తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామచంద్రు
*నాగారం,నమస్తే హైదరాబాద్:* (ఆగస్టు 25 )
నాగారం మండల పరిధిలోని వర్ధమానుకోట గ్రామానికి చెందిన మట్టిపెల్లి చక్రయ్య (Late) – కొమురమ్మ దంపతుల రెండవ కుమారుడైన మట్టిపెల్లి రామచంద్రు కి ప్రొఫెసర్ చెన్న కృష్ణారెడ్డి పర్యవేక్షణలో ” హీట్ అండ్ మాస్ ట్రాన్సఫర్ అనాలసిస్ ఆఫ్ ఎంహెచ్డి నాన్- న్యూటోనియన్ నానో ఫ్లూయిడ్స్ ఫ్లో విత్ గైరోటాక్టిక్ మైక్రో ఆర్గానిసమ్స్ ఇన్ ఎ పోరస్ మీడియం ఓవర్ డిఫరెంట్ జామెట్రీస్” అనే అంశంపై పరిశోధనలు చేసి గ్రంథాన్ని సమర్పించినందుకుగాను ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డును ప్రకటించింది. రామచంద్రు విద్యాభ్యాసం తన స్వగ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు పూర్తి చేసి, ఉన్నత విద్యను అభ్యసించాలన్న పట్టుదలతో ఇంటర్, డిగ్రీ అనంతరం పీజీ, బీఈడీ ఎంట్రెన్స్ లో ఉత్తమ ర్యాంక్ సాధించి ఎమ్మెస్సీ, బీఎడ్ ఉస్మానియా క్యాంపస్ లో పూర్తి చేశారు. విద్యాభ్యాసం చేస్తూనే తెలంగాణ వస్తే మన జీవితాలు మారతాయి తెలంగాణ నిర్మాణం మా హక్కు అంటూ తెలంగాణ ఉద్యమంలో డిగ్రీ చేస్తున్న నాటి నుండే సూర్యాపేట తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టెంట్ వేసి నిరాహార దీక్షలు, పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నాడు జెఎసి తలపెట్టిన విద్యార్థి మహా గర్జనకు సూర్యాపేట నుండి విద్యార్థులను మమేకం చేసి కొట్లాడిన వారిలో తను ఒక్కడు. ఆ తర్వాత వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పోలికేక సభకు పూర్వ నల్గొండ జిల్లా అర్వపల్లి నుండి కాకతీయ యూనివర్సిటీ పొలికేక సభ వరకు 150 కిలోమీటర్ల మేర పది రోజులపాటు పాదయాత్ర చేసి పొలి కేక సభలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా 18 మార్చ్ 2011 రోజున తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశ పెట్టాలని 33 మందితో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన వారిలో రామచంద్రు(చందు) ముఖ్యుడు. దీక్షను ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం 5 రోజుల అనంతరం నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. ఉద్యమంలో జేఏసీ తలపెట్టిన ఎన్నో ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని జైలు గోడల మధ్య బతికి, లాఠీ దెబ్బలు సైతం లెక్కచేయకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక బోధన మీద ఉన్న మక్కువతో మహాత్మ గాంధీ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, గణిత శాస్త్రం మీద ఉన్న ఆసక్తి, కొత్త ఆవిష్కరణలు చేయాలన్న తపనతో పీహెచ్డీ లో జాయిన్ అయ్యి ఉత్తమ జర్నల్స్ లలో పరిశోధన పత్రాలు ప్రచురితం చేసి ఉస్మానియా యూనివర్సిటీ కి థీసిస్ సమర్పించినందుకు గాను ఓయూ డాక్టరేట్ పట్టాను ప్రకటించింది.100 యేండ్ల చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ నుండి పట్టా అందుకోవడం పట్ల ప్రొఫెసర్లు ,మిత్రులు, కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు రామచంద్రు ను అభినందించారు.
ప్రస్తుతం నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.